విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అవినీతి రహిత పాలనకు నడుం బిగించారని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విజయవాడలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లకు మంగళవారం వర్క్షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కమిషనర్లను ఉద్దేశించి ప్రసంగించారు. అవినీతిని నిర్మూలించేందుకు వార్డు సేవకులను నియమించబోతున్నామని చెప్పారు. పథకాల అమలుకు వార్డు సేవకులను ఎలా వాడుకోవాలనేది ఈ వర్క్షాపు ఉద్దేశమన్నారు. సమస్యలపై ఉన్నతాధికారులతో చర్చించాలని సూచించారు. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వమని..ప్రజాప్రతినిధులను కలుపుకుపోవాలని చెప్పారు. సమన్వయంతో పని చేస్తూ ప్రజలకు మంచి పాలన అందించాలని అన్నారు. మంచినీరు, పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేసి, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలన్నారు.