తాడేపల్లి: కోవిడ్ కష్టకాలంలోనూ కోతల్లేకుండా కరెంటు ఇచ్చామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఒక్కరోజు విద్యుత్ సరఫరాలో కాస్త అంతరాయం ఏర్పడితే, ప్రతిపక్షం దీన్ని రాద్ధాంతం చేస్తూ రాజకీయం చేస్తూ మాట్లాడడం సరికాదన్నారు. ఇవాళ, రేపు పరిస్థితిని చక్కదిద్దుతాం. ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా చూస్తామన్నారు. రాష్ట్రంలో గత రెండున్నర ఏళ్లుగా ఎక్కడా విద్యుత్ కొరత అన్నది లేకుండా సరఫరా చేయడం జరిగిందన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోతే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ చెల్లించడం జరిగిందన్నారు. కొవిడ్ పరిస్థితుల్లో కూడా ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా, ఎక్కడా వ్యవసాయానికి కానీ, గృహావసరాలకు కానీ విద్యుత్ కోత లేకుండా సరఫరా చేశామన్నారు. భవిష్యత్తులో కూడా విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన ప్రణాళికలు రూపొందించామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.