విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ప్రమాదానికి కారణమైన స్టైరిన్ కొరియా కు తరలించామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని, బాధిత గ్రామ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. గురువారం విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. గ్యాస్ లీకేజ్ ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి స్పందించారని తెలిపారు. వెంటనే బాధితులను పరామర్శించి మానసిక ధైర్యం అందించారని పేర్కొన్నారు. ఐదుగురు మంత్రులు, ముగ్గురు ఎంపీలు కూడా బాధిత గ్రామాల్లో పర్యటించి ప్రజల్లో భరోసా నింపారన్నారు. పార్టీలు, కులాలకు అతీతంగా బాధితులందరికీ తక్షణ పరిహారం అందించామని మంత్రి పేర్కొన్నారు. బాధిత గ్రామాల్లో మెడికల్ క్యాంప్లు నిర్వహించామని, వైఎస్సార్ క్లినిక్ కూడా ఏర్పాటు చేశామని మంత్రి అవంతి వెల్లడించారు.