విశాఖపట్నం: రాజకీయాలు, ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అభిమతం అని పర్యాటక, సంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ అవసరమన్న సీఎం వైయస్ జగన్ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారని చెప్పారు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధిస్తుందని వివరించారు. చంద్రబాబు ఉన్నంత వరకు ఏపీ అభివృద్ధి జరగదన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని సీఎం వైయస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువస్తే చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు అడ్డుతగులుతున్నారన్నారు. కుల, రాజకీయ విద్వేషాలు సృష్టించి రెచ్చగొట్టడం చంద్రబాబుకు అలవాటన్నారు. రాష్ట్ర ప్రజలంతా మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే చంద్రబాబు ఒక్కరే వ్యతిరేకిస్తున్నారన్నారు.
మహిళా భద్రత కోసం దిశ చట్టం తీసుకువచ్చిన సీఎం వైయస్ జగన్ దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలుస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. ఆడవారిపై అత్యాచారాలు, వేధింపులకు పాల్పడిన వారిని 21 రోజుల్లో శిక్షిస్తామని చేసిన చట్టం చూసి మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు హర్షిస్తున్నాయని చెప్పారు. దిశ చట్టం చేసి మహిళలకు అండగా సీఎం వైయస్ జగన్ నిలిచారని చెప్పారు.