ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టాలి
విజయవాడ: రాష్ట్రంలో సాగు, తాగు నీరు కొరత లేకుండా ఇరిగేషన్ ప్రాజెక్ట్ల నిర్మాణాలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి దృష్టి సారించారని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. భవిష్యత్లో పెరగనున్న నీటి అవసరాలని దృష్టిలో పెట్టుకుని భూగర్బజలాలను సంరక్షించాలన్నారు. ఏపీ భూగర్బ జలాలు, జలగణనశాఖ స్వర్ణోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి నీటిబొట్టుని వినియోగించండంపై దృష్టిసారించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. భూగర్బజల వ్యవస్థలో సవాళ్లకి జాతీయ సదస్సు ద్వారా సమాధానాలు దొరుకుతాయని ఆశిస్తున్నానన్నారు. రాష్ట్రంలో భూగర్బ జలాల లభ్యత, వినియోగంపై శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు చేస్తున్న పరిశోధనలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడతాయన్నారు. వైయస్ఆర్ జలకళ ద్వారా రైతులకి ఉచితంగా బోర్లు తవ్వే పథకాన్ని సీఎం వైయస్ జగన్ ప్రారంభించారన్నారు. రాయలసీమలోనూ సాగు, తాగు నీటి కొరత లేకుండా ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.