వ్యవసాయ దండుగ నుంచి వ్యవసాయ పండుగ
అమరావతి: వ్యవసాయ దండుగ అన్న చంద్రబాబు పాలన నుంచి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఏపీ శాసన మండలి సమావేశాలు రెండోరోజు సమావేశాల్లో భాగంగా.. ఉద్దేశపూర్వకంగా సభను అడ్డుకునేందుకు టీడీపీ సభ్యులు ప్రయత్నించారు. ఈ సందర్భంలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్న చందాన ఉందని ఎద్దేవా చేశారు. ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి అంబటి తెలిపారు. సభాకార్యక్రమాలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే యత్నం చేస్తున్నారని, మంత్రి ప్రసంగాన్ని అడ్డుకోవడం సముచితమేనా? అని మండలి చైర్మన్ టీడీపీ సభ్యులను ప్రశ్నించారు. చంద్రబాబు 'మనసులో మాట' పుస్తకాన్ని దాచేశారని, 2014 మేఫెస్టోను కూడా దాచేశారన్నారు. దమ్ముంటే 'మనసులో మాట' పుస్తకాన్ని బయటకు తీసుకురండి అంటూ మంత్రి అంబటి రాంబాబు సవాలు విసిరారు.