తాడేపల్లి: అండర్ గ్రాడ్యుయేషన్ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) పరీక్షలు రద్దు చేస్తున్నామని విద్యాశాఖ అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. యూజీ, పీజీ పరీక్షలు రద్దు అయ్యే అవకాశం లేదన్నారు. తాడేపల్లిలో మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తున్నామని, ఇప్పుడు నిర్వహించకపోతే పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలో చర్చిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డితో చర్చించి ఎలా ముందుకెళ్లాలో నిర్ణయిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు పరీక్షలు రద్దు చేస్తున్నామని ప్రకటించలేదన్నారు. సీఎం వైయస్ జగన్ అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామని వివరించారు. యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం అకాడమిక్ క్యాలెండర్ రూపొందిస్తామని మంత్రి సురేష్ తెలిపారు.