4వ తేదీ కల్లా ‘మౌలిక’ ప్రాజెక్టులపై ప్రణాళిక సిద్ధం చేయండి

19 Jan, 2022 10:52 IST

అమరావతి: మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు సంబంధించి 2022–23 ఆర్థిక ఏడాదికి ఫిబ్రవరి 4వ తేదీ కల్లా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆదేశించారు. పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై మంత్రి  సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. ఎయిర్‌పోర్టులు, పోర్టుల ప్రగతి, విశాఖ–చెన్నై కారిడార్‌ పురోగతిపై మంత్రి వివరాలు తెలుసుకున్నారు. ఫిబ్రవరి 4వ తేదీకల్లా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈడీబీ, ఎంఎస్‌ఎంఈ, ఏపీఐఐసీ, మారిటైమ్‌ బోర్డు తదితర అన్ని విభాగాలను పరిశ్రమల శాఖ వెబ్‌సైట్‌లో లింక్‌ ద్వారా ఓపెన్‌ చేసేందుకు వీలుగా వెబ్‌సైట్‌ విండో తయారు చేయాలని మంత్రి సూచించారు. 

లేపాక్షి, హస్తకళలు కలిపి జాయింట్‌ ఔట్‌లెట్లు..: చేనేత, జౌళి, హస్తకళలను ప్రజలకు మరింత చేరువ చేయాలని అధికారులను మంత్రి మేకపాటి ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో చేనేత, జౌళి శాఖలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 3వ తేదీ కల్లా వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేయబోయే కార్యక్రమాల కార్యాచరణను సిద్ధం చేయాలని సూచించారు. లేపాక్షి, హస్తకళలకు ప్రస్తుతం వేర్వేరు ఔట్‌లెట్లు ఉన్నాయని, వాటిని జాయింట్‌ ఔట్‌లెట్లుగా నిర్వహిస్తే మరింత వ్యాపారం జరిగే అవకాశముందన్నారు.