విజయవాడ: ప్రజలకు సులభతరమైన రెవెన్యూ సేవలు, సమగ్ర సర్వే, పక్కాగా భూరికార్డుల పరిశీలన, సూచనలు చేయడమే లక్ష్యంగా రెవెన్యూ భూముల సంస్కరణల మంత్రి వర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. సమీక్షలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్, కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రెవెన్యూ సంబంధిత సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. 22ఏ కింద ఉన్న భూములపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఎస్టేట్, ఇనాం భూములపై సుదీర్ఘంగా చర్చించారు. వ్యవసాయ భూములకు అతి తక్కువగా రుసుము చెల్లించి కన్వెర్ట్ చేసి రూ.కోట్ల అర్జిస్తున్నారనే అంశాన్ని సమీక్షించారు. ఫ్రీడం ఫైటర్స్, మాజీ సైనికులకు ఇచ్చిన భూముల ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేసి తగిన న్యాయం చేయాలని కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు నిర్ణయించారు.