గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన
తాడేపల్లి: మహాత్ముడి ఆశయాలకు అనుగుణంగా పరిపాలన చేస్తూ గాంధీజీ ఆలోచనలను ఆచరణలో పెట్టి ముఖ్యమంత్రి వైయస్ జగన్ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చారని ప్రభుత్వ సలహాదారు, వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మహాత్మా గాంధీకి నివాళి మాటల్లోనే కాకుండా చేతల్లో చూపుతూ గ్రామస్థాయి పరిపాలనను చేర్చి.. అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సీఎం వైయస్ జగన్ అమలు చేశారన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైయస్ఆర్ సీపీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాత్ముడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మనసు పెట్టి గాంధీ ఆలోచనలను అమలు చేస్తే సమాజాన్ని ఆదర్శవంతంగా మార్చడమే కాకుండా స్వావలంబన దిశగా ఎలా మార్చగలం అనేది మన రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్ నాయకత్వంలో చూశామన్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి వారసుడు వైయస్ జగన్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రెండేళ్ల క్రితం వరకు మాటల్లో మాత్రమే ఉన్న గాంధీజీ తత్వాన్ని ఆచరణలోకి తీసుకొచ్చారని గుర్తుచేశారు.
టెక్నాలజీ పెరిగిన కాలంలో గ్రామ స్వరాజ్యం ఏంటీ అని అందరూ అనుకున్న దశలో సీఎం వైయస్ జగన్ గ్రామాల అభివృద్ధి అవసరమేనని, పరిపాలనకు గ్రామస్థాయికి తీసుకువెళ్లారన్నారు. గుమ్మం ముందుకు పాలన తీసుకెళ్లి.. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచేలా చేశారన్నారు. ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ పరిపాలన పగ్గాలు చేపట్టిన రెండేళ్లలోనే ఊహించని ప్రగతి జరుగుతుందని, వచ్చే మూడేళ్లలో మరిన్ని అభివృద్ధి సంక్షేమాలు జరుగుతాయన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మరో అడుగు ముందుకేసి ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. రాజకీయాలు గ్రామాల్లో ఉండకూడదు.. కక్షలు పెరగకూడదనే ఉద్దేశంతో ఏకగ్రీవాలను ప్రోత్సహించేలా అడుగులు వేయాలని సూచిస్తున్నారన్నారు. ఇలాంటి ఆలోచనలు, విధానాలు బాగా పరిపక్వత చెందిన మహర్షి స్థాయి లాంటి వ్యక్తికి మాత్రమే ఉంటాయని, కానీ, 47 ఏళ్ల వయస్సులో ముఖ్యమంత్రి వైయస్ జగన్ అంత పరిపక్వత చూపడం నిజంగా విశేషమన్నారు.