నా భర్త మరణంపై అనుమానాలున్నాయి

2 Jul, 2025 17:58 IST

తాడేపల్లి: త‌న‌ భర్త సింగ‌య్య‌ మరణంపై అనుమానాలున్నాయ‌ని ఆయ‌న స‌తీమ‌ణి లూర్దు మేరీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంబులెన్సులో ఏదో జరిగినట్లనిపిస్తోంద‌ని ఆమె అనుమానం వ్య‌క్తం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చీలి సింగయ్య భార్య లూర్దు మేరీ, కుమారులు, కుటుంబసభ్యులతో సహా క‌లిశారు. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడారు.  లూర్దు మేరీ ఏమన్నారంటే..:

అంబులెన్సులో ఏదో జరిగింది:
    జగనన్న మా ప్రాంతానికి వస్తున్నారని తెలియగానే ఆయనను  చూడడానికి మేమంతా వెళ్ళాం. పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో, మేము కాస్త దూరంలోనే ఉండిపోయాం. కాసేపటి తర్వాత నా భర్తకు యాక్సిడెంట్‌ జరిగిందని, ఎవరో ఫోన్‌ చేస్తే తెలిసింది. ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఆయన బాగానే ఉన్నారు. నా భర్త స్వయంగా తన పేరు, ఊరుతో పాటు, మా కుటుంబ సభ్యులందరి వివరాలు చెప్పారు. ఆ తర్వాత ఆయనను అంబులెన్సులో ఆస్పత్రికి తీసుకెళ్లారని తెలుసుకుని, మేము ఆస్పత్రికి వెళ్లాం. అక్కడ ఆయన చనిపోయారు. అంత వరకు బాగా ఉన్న మా ఆయనను, అంబులెన్సులో ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత ఎలా చనిపోయారు? అందుకే ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్ళే సమయంలో అంబులెన్స్‌లో ఏమైనా చేశారా అని అనుమానం వస్తోంది. దీనిపై నిజాలు తేలాలి.

టీడీపీ వారు మా ఇంటికొచ్చారు:
    మా ఆయన చనిపోయిన తర్వాత మా ఇంటికి పోలీసులు వచ్చి యాక్సిడెంట్‌ వీడియోలు చూపారు. ఆ తర్వాత దాదాపు 50 మంది టీడీపీ మనుషులు కూడా మా ఇంటికి వచ్చి.. లోకేష్‌ పంపారు, మేం కూడా మీ కులస్తులం, ఎస్సీలమే అని చెప్పారు. ఇంకా ఏవేవో మాట్లాడి ప్రలోభపెట్టాలని చూశారు. అందుకే మా ఆయన మరణంపై మాకు అనుమానాలు వస్తున్నాయి. ప్రమాదం తర్వాత మా ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు సిద్ధమైతే, పోలీసులు బలవంతంగా అంబులెన్సు వచ్చే వరకు ఆపారు. ఆటో లేదా మరే వాహనంలో సింగయ్యను ఆస్పత్రికి తీసుకుపోవద్దని, కచ్చితంగా అంబులెన్సులోనే తీసుకెళ్లాలని పోలీసులు బలవంతం చేశారు. అందుకే ఆ అంబులెన్సులోనే ఏదో జరిగిందని మాకు బలమైన అనుమానాలు వస్తున్నాయి.
    ఇప్పుడు తమకు వైయ‌స్ జగన్‌గారు ఎంతో భరోసా ఇచ్చారని, కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారని లూర్దు మేరీ వివరించారు.