విజయనగరం: మూడు రాజధానులు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి విజన్ అని పార్వతీపురం మన్యం వైయస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఉప ముఖ్యమంత్రి కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను రాజకీయంగా అడ్డుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని ఆమె మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజలకు మిగతా ప్రాంతాల ప్రజలకు మధ్య తగవులు పెట్టాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని తప్పుపట్టారు.
అమరావతి అనేది కేవలం 29 గ్రామాలకు పరిమితమైనటువంటి ఒక రాజధాని, అమరావతిని అభివృద్ధి చేయాలంటే లక్ష కోట్లు అవసరమన్నారు. రాష్ట్రంలో ఇంత సంక్షేమ అభివృద్ధి జరిపిస్తూ లక్ష కోట్లు పెట్టి రాజధాని కట్టే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనే ఉద్దేశంతో అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా, కర్నూలు న్యాయ రాజధానిగా, విశాఖను పరిపాలన రాజధానిగా చేయబోతున్నామన్నారు.
ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు అయ్యుండి ఈ ప్రాంత ప్రజల మనోభావాలను పక్కనపెట్టి రాజకీయ లబ్ధి కోసం అమరావతి రాజధానికి మద్దతు పలకడం దారుణం అని మండిపడ్డారు. ఇప్పటికే కొంత అభివృద్ధి చెందిన విశాఖను కొంత మేర ఖర్చు పెట్టి అభివృద్ధి చేసినట్లయితే కొన్ని దశాబ్దాల్లో హైదరాబాద్ ను తలదన్నే రాజదాని అవుతుందన్నారు. మా పార్టీ విధానం , మా ప్రభుత్వ విధానం మూడు రాజదానులే అని పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు.