వైయస్ జగన్ మీద అక్కసుతో ప్రజలపై కక్షసాధింపు చర్యలు
అంబేద్కర్ కోనసీమ జిల్లా: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై అక్కసుతో కూటమి ప్రభుత్వం ప్రజలపై కక్షసాధింపు చర్యలకు తెగబడిందని కోనసీమ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి మండిపడ్డారు. సోమవారం ఎండీయూ వెహికల్ ఆపరేటర్స్ చేస్తున్న నిరసన కార్యక్రమానికి వైయస్ఆర్సీపీ మద్దతుగా నిలిచింది. ఆపరేటర్ల నిరసన కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొని వారికి మద్దతు తెలిపారు. ఆపరేటర్లను కొనసాగించాలని జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన "ఇంటింటికి రేషన్" పథకాన్ని ఇప్పటి కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఇంటింటికి రేషన్ పథకం నిర్వీర్యం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 9,600 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి అమలాపురం పార్లమెంట్ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, జడ్పీ చైర్మన్ విపత్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇశ్రాయేల్, పొన్నాడ వెంకట సతీష్ కుమార్, గన్నవరపు శ్రీనివాసరావు, పాముల రాజేశ్వరి దేవి, గొల్లపల్లి డేవిడ్ రాజు, మార్గాని గంగాధర్ రావు, పితాని బాలకృష్ణ, చెల్లుబోయిన శ్రీను పాల్గొన్నారు.