తాడేపల్లి: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గడపకూ తీసుకెళ్లాలని, మే 10వ తేదీ నుంచి గడప గడపకూ వైయస్ఆర్ సీపీ కార్యక్రమం ప్రారంభించాలని సీఎం వైయస్ జగన్ సూచించారని వైయస్ఆర్ సీపీ రీజనల్ కోఆర్టినేటర్, ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్టినేటర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ప్రభుత్వం, పార్టీ సమన్వయంపై సీఎం వైయస్ జగన్ దిశానిర్దేశం చేశారు.
సమావేశం అనంతరం పార్టీ రీజనల్ కోఆర్టినేటర్, ఎమ్మెల్యే కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. 2019లో వచ్చిన 151 సీట్లకు అదనంగా గెలవాలి కానీ, తక్కువ రావడానికి అవకాశం లేదని సీఎం సూచించారని కొడాలి నాని చెప్పారు. మంత్రులు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్టినేటర్లను సమన్వయం చేసుకొని మే నెల 10వ తేదీ నుంచి ఎమ్మెల్యేలు వారివారి నియోజకవర్గాల్లో పర్యటించమని, ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఆ కుటుంబాలకు అందిన లబ్ధిని వివరించాలని సీఎం సూచించారన్నారు. జూలై 8వ తేదీన పార్టీ ప్లీనరీ నిర్వహించనున్నట్టు చెప్పారు. పార్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు నడిపించాలని ఆదేశించారన్నారు. మే 10వ తేదీ నుంచి గడప గడపకూ వైయస్ఆర్ సీపీ ప్రారంభం కానుందని కొడాలి నాని వివరించారు. వైయస్ఆర్ సీపీ మేనిఫెస్టోను ప్రతి గడపకూ తీసుకెళ్లి.. మేనిఫెస్టో హామీలు 95 శాతం అమలు చేశామని ప్రజలకు వివరించాలని చెప్పారన్నారు.
మన శత్రువులు చంద్రబాబు మాత్రమే కాదు.. ఈనాడు, ఏబీఎన్, టీవీ5, వీరందరూ కుట్ర పూరితంగా, మీడియా ముసుగులో ప్రభుత్వాన్ని అల్లరి చేసి చంద్రబాబును తీసుకువచ్చి సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని, వీటన్నింటినీ పార్టీ యంత్రాంగం ఎదుర్కోవాలని సీఎం దిశానిర్దేశం చేశారన్నారు. అందరూ కలిసి పనిచేయాలి. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సీఎం వైయస్ జగన్ సూచించారని కొడాలి నాని వివరించారు.