హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. రోజుకో జిల్లా నుంచి వివిధ పార్టీల నాయకులు వైయస్ఆర్సీపీలో చేరుతున్నారు. రెండు రోజుల క్రితం నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి బావ రామకోట సుబ్బారెడ్డి, ఆయన కుమారులు, అనుచరులు వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఇవాళ అదే జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కనుమూరు రవి చంద్రారెడ్డి, కనుమూరు హరిచంద్రారెడ్డి, వారి అనుచరులు వైయస్ఆర్సీపీలో చేరారు. వారికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామని వైయస్ జగన్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే సంజీవయ్య, నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రవిచంద్రారెడ్డితో పాటు పాతపట్నంకు చెందిన నారాయణ మూర్తి కూడా పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై పోరాడాల్సిన కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కుమ్మక్కైందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు రహస్య ఎజెండాతో ముందుకు వెళ్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ తీరు నచ్చకపోవడంతోనే వైయస్ఆర్సీపీలో చేరామని తెలిపారు. 60 నుంచి 70 అసెంబ్లీ స్థానాల్లో 10 వేల ఓట్ల చొప్పున చీల్చడానికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి టీడీపీతో ఒప్పందం చేసుకుందని ఆరోపించారు.