అరెస్టులతో అభిమానాన్ని అడ్డుకోలేరు
నెల్లూరు జిల్లా: మా నాన్న కాకాణి గోవర్ధన్రెడ్డిపై సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ప్రేమ, అభిమానాన్ని అక్రమ కేసులు, అరెస్టులతో అడ్డుకోలేరని కూటమి నేతలను కాకాణి కూతురు, వైయస్ఆర్సీపీ నాయకురాలు కాకాణి పూజితారెడ్డి హెచ్చరించారు. గురువారం నెల్లూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
కాకాణి పూజితారెడ్డి ఏమన్నారంటే..
`వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 4 వ తేదీ సర్వేపల్లిలో నిర్వహించిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి ప్రతి గ్రామంలోని వాడ వాడల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నా, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. అరకొరగా పథకాలు అందిస్తూ, ప్రజలను మభ్యపెడుతున్నారు.
కూటమి ప్రభుత్వంపై అసంతృప్తితో ప్రజలు నిరసన తెలియజేశారు. వైయస్ జగన్ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమంతో పాటు శాంతిభద్రతలు ఎక్కడా క్షీణించకుండా సుపరిపాలనను అందించారు. కూటమి ప్రభుత్వంలో రెడ్బుక్ రాజ్యమేలుతోంది. ప్రశ్నించిన వారి గొంతు అక్రమ కేసులతో నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు పరిధి దాటి ప్రజలపై నియంతలా ప్రవర్తిస్తున్నారు, ఇది ఎంతవరకు సమంజసం. కూటమి ప్రభుత్వం ప్రజలపై ఒక నియంతలా వ్యవహరిస్తుంది. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు.నాయకులు, ప్రజల సమస్యల గురించి మాట్లాడకూడదు అనే విధంగా వీరి వ్యవహారం ఉంది.
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన ప్రజలు అంతే ఉత్సాహంతో నిరసన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో పత్రికలకు కూడా స్వేచ్ఛ లేకుండాపోయింది. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రథమం. నాన్న కాకాణి గోవర్ధన్రెడ్డిని జైల్లో పెట్టినా, కార్యకర్తలు, నాయకులను ఇబ్బందులకు గురిచేసినా, కేసులు పెడతామని భయపెట్టినా, వాటన్నింటిని దాటి నిరసన కార్యక్రమంలో పాల్గొని, విజయవంతం చేయడం సంతోషాన్ని కలిగించింది. అరెస్టులతో అక్రమ కేసులతో నాన్నపై సర్వేపల్లి ప్రజలకు ఉన్న అభిమానాన్ని ఆపలేరు.నిరసన కార్యక్రమంలో అధికారులు మమ్మల్ని అడుగడుగున అడ్డుకున్నా, మాకు రక్షణగా సర్వేపల్లి ప్రజలు నిలబడ్డారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి మాకు నాయకుడు మాత్రమే కాదు మార్గదర్శి కూడా..ఆయన కుమార్తె నిరసన కార్యక్రమం చేపట్టలేదని అవహేళనతో అడ్డంకులు సృష్టించినా వారందరికీ ఈ కార్యక్రమం విజయవంతం కావడం చెంపపెట్టు.. మేం చేపట్టిన కార్యక్రమంలో ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి పాల్గొని మాలో ఆత్మస్థైర్యాన్ని నింపారు.
మా కుటుంబానికి మెండుగా సర్వేపల్లి ప్రజల అభిమానం, ప్రేమ ఉందని గమనించాలి. ప్రభుత్వ పెద్దలు ఇకనైనా కక్షసాధింపు చర్యలకు స్వస్తి పలికి ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి` అంటూ కాకాణి పూజితారెడ్డి హితవుపలికారు. వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం విజయవంతం చేసిన వైయస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, సర్వేపల్లి ప్రజలకు ఆమె పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు.