వైయస్ జగన్పై ఉన్న అభిమానాన్ని అడ్డుకోలేరు
వైయస్ఆర్ జిల్లా: మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న అభిమానాన్ని ఎవరూ అడ్డుకోలేరని కడప ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి స్పష్టం చేశారు. వైయస్ జగన్ నిన్న బంగారుపాళ్యం వెళితే ప్రజా స్పందన ఎలా ఉందో రాష్ట్రం అంతా చూసిందని చెప్పారు. పోలీసులను భద్రత కోసం ఇస్తారు..కానీ మన రాష్ట్రంలో వైయస్ జగన్ కోసం వస్తున్న జనాన్ని ఆపడానికి వినియోగిస్తున్నారని మండిపడ్డారు. వైయస్ జగన్ పర్యటనకు రైతులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసిందని ఆక్షేపించారు. ఇలాంటి ఘోరమైన పరిస్థితిని రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని హెచ్చరించారు. బంగారుపాళ్యంకు 8 ఫ్లాటూన్ల పోలీసులను తీసుకువచ్చి అడ్డుకున్నా రైతులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారన్నారు. ఎంత నియంత్రించినా వైయస్ జగన్ను, ఆయనపై ఉన్న అభిమానాన్ని అడ్డుకోలేరని పేర్కొన్నారు. వైయస్ జగన్ ప్రకృతి వంటి వారు..మీరు ఎంత ఆపాలని చూసినా ఆపలేరన్నారు. ఇది ఈ ప్రభుత్వానికి గుణపాఠం కావాలని హెచ్చరించారు. ఒక ప్రజా నాయకుడు రైతులకు అండగా నిలవడానికి వస్తే అడ్డుకోవడం దారుణమని తప్పుపట్టారు. మీ వైఖరి తప్పని ప్రజలు, రైతులు స్పష్టంగా నిరూపించారని, ఇది కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు కావాలని వైయస్ అవినాష్రెడ్డి హెచ్చరించారు.