జకియా ఖనమ్ ముస్లింలకు నమ్మక ద్రోహం చేశారు
ఎన్టీఆర్ జిల్లా: శాసన మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖనమ్ బీజేపీలో చేరి ముస్లిం సమాజానికి నమ్మక ద్రోహం చేశారని జగ్గయ్యపేట మున్సిపల్ వైస్ ఛైర్మన్ పఠాన్ హఫీజున్నిసా, ఫిరోజ్ ఖాన్ మండిపడ్డారు. గురువారం జగ్గయ్యపేట పట్టణంలోని వైయస్ఆర్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో వారు ముస్లిం నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా వైస్ ఛైర్మన్ పఠాన్ హఫీజున్నిసా మాట్లాడుతూ.. భర్త చనిపోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న జకియా ఖనమ్ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకొని రాజకీయ భవిష్యత్ ఇచ్చిందన్నారు. ఆమెను ఉన్నత పదవిలో కూర్చోబెట్టి, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకు వచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్కే దక్కిందన్నారు. కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు ముస్లింలను ఇప్పటివరకు ఓటు బ్యాంకుగానే చూశారు తప్ప వారికీ చట్ట సభల్లో సముచిత స్థానం, ఉన్నత పదవులు ఇచ్చింది లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించారని, ఆయన తనయుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లింలకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముస్లింలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్ తదితర పదవుల్లో అవకాశం ఇచ్చి వైయస్ జగన్ ప్రోత్సహించారన్నారు. దేశవ్యాప్తంగా ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా నల్ల చట్టాలను తెచ్చి విషం చిమ్ముతున్న మతతత్వ పార్టీ బీజేపీలో జకియా ఖనమ్ చేరి ముస్లిం జాతికి తీరని ద్రోహం చేసిన, ఆమె ముస్లిం జాతి క్షమించదన్నారు. సమావేశంలో మైనార్టీ సీనియర్ నాయకులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, జగ్గయ్యపేట పట్టణ మహిళా అద్యక్షురాలు షేక్ మునిరా తదితరులు పాల్గొన్నారు.