నెల్లూరు: నవరత్నాలు నిరుపేద కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతున్నాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. నెల్లూరులోని పోలీస్ పరేడ్గ్రౌండ్లో 74వ స్వాతంత్య్ర దినోత్సవంలో మంత్రి సుచరిత పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ప్రతి పథకం పారదర్శకంగా అమలు చేస్తున్నారని చెప్పారు. నెల్లూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి వసతి కోసం రూ.211 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. సంగం బ్యారేజీ పనులను ఈ ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. ఆ సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. కరోనా నివారణకు కోవిడ్ ఆస్పత్రుల్లో అధునాతన వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటున్నామని, రైతుకు ఏ సమస్య వచ్చినా రైతు భరోసా కేంద్రాలు పరిష్కరిస్తాయని, ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని వివరించారు.