వైయస్ జగన్ ఆశీస్సులతో పార్లమెంట్ మెట్లు ఎక్కిన తొలి వ్యక్తిని నేను
ఢిల్లీ: వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో తమ కమ్యూనిటీలో పార్లమెంట్ మెట్లు ఎక్కిన తొలి వ్యక్తిని తాను అంటూ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. ఢిల్లీలో రిటైర్ అవుతున్న వైయస్ఆర్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభ వీడ్కోలు కార్యక్రమంలో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వైయస్ జగన్ ఆశీస్సులతో పార్లమెంట్ మెట్ల ఎక్కిన తొలి వ్యక్తి నేనని గుర్తుచేసుకొని, ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం, కొంతమంది పోలీసు, అధికారుల తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఫిరాయింపుల చట్టాన్ని అమలు చేయకపోవడం ప్రజాస్వామ్యానికి హానికరమని, స్పీకర్ను జడ్జి స్థానం నుంచి తొలగించి ఫిరాయింపుల కేసులను హైకోర్టుకు అప్పగించాలని, మూడు నుంచి ఆరు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.
అలాగే రాష్ట్రాల్లో సమాచార హక్కు చట్టం నిర్వీర్యమవడం, అనేక జీవోలను దాచడం అవినీతి, బంధుప్రీతి వల్ల జరుగుతున్నందున ప్రజాస్వామ్యంపై భరోసా తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలను పటిష్టంగా అమలు చేయకపోతే ప్రజాస్వామ్యం అంతరించిపోతుందన్న హెచ్చరిక చేశారు. పార్టీలు గెలిచిన తర్వాత మధ్యలో రాజీనామా చేసి మరొక పార్టీకి చేరడం వల్ల ప్రజాస్వామ్యంపై అవిశ్వాసం పెరుగుతున్నదని విమర్శిస్తూ, ఫిరాయింపుల చట్టం లక్ష్యం నెరవేరేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.