సానుభూతి ఓట్ల కోసమే చంద్రబాబు నాటకాలు
13 Apr, 2021 17:44 IST
గుంటూరు: సానుభూతి ఓట్ల కోసమే చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. నిన్న తిరుపతిలో రోడ్ షో నిర్వహిస్తుండగా తమపై రాళ్ల దాడి జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలను రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ఖండించారు. చంద్రబాబు రోడ్ షోపై రాళ్ల దాడి జరగలేదని ఆమె వెల్లడించారు. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికలో సానుభూతి ఓట్లు పొందడం కోసమే ఈ ఎత్తుగడ వేశారని పేర్కొన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు రాళ్ల దాడి నాటకాలకు తెరలేపారని వివరించారు. వైయస్ఆర్ సీపీ నేతలపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని, రాళ్ల దాడి చేయాల్సిన అవసరం మాకు లేదని ఆమె స్పష్టం చేశారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తిరుపతి బరిలో వైయస్ఆర్సీపీ విజయాన్ని అడ్డుకోలేరని సుచరిత ధీమా వ్యక్తం చేశారు.