తాడేపల్లి: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ను స్వాగతిస్తున్నామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నదీ జలాల విషయంలో న్యాయం ఆంధ్రరాష్ట్రంవైపు ఉందన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో బోర్డుల పరిధిని నిర్ణయించి ఉంటే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయ్యేది కాదన్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం నీళ్లను అడ్డగోలుగా వదిలేశారని, తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రయోజనాలకు గండి కొట్టిందన్నారు. తెలంగాణ దూకుడుగా ఉన్నా ఆంధ్రప్రదేశ్ సంయమనం పాటించిందని చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి రాజ్యాంగబద్ధంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విజయం సాధించారన్నారు.