బరితెగించి వ్యవహరిస్తున్న టిడిపి నేతలు
అల్లూరి జిల్లా: పాడేరు ప్రాంతంలో మోదమాంబ ఉత్సవ కమిటీ చైర్మన్ నియామకంపై టీడీపీ నేతలు బరితెగించారు. నిబంధనలను పక్కనబెట్టి అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. పాడేరు మోదమాంబ ఉత్సవ కమిటీ చైర్మన్గా గిడ్డి ఈశ్వరి నియామకంపై గిరిజనులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉత్సవ కమిటీ చైర్మన్గా కొనసాగుతున్న వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజును పక్కనబెట్టి ఈ నియామకం చేపట్టడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మోదకొండమ్మ జాతర తేదీలను కూడా కూటమి నేతలు మార్చిన విషయంపై గిరిజనుల్లో అసంతృప్తి నెలకొంది. సంప్రదాయాలకు విరుద్ధంగా తీసుకుంటున్న నిర్ణయాలు స్థానిక భావోద్వేగాలను దెబ్బతీస్తున్నాయని వారు వాపోతున్నారు. కూటమి నేతల ఈ విధానంతో విసిగిపోయిన గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకోవాలని, ఉత్సవాల నిర్వహణలో రాజకీయ జోక్యం వద్దని వారు డిమాండ్ చేస్తున్నారు.