ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేయాల్సిందే
అనంతపురం: ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేయాల్సిందేని, లేకుంటే ఊరుకునేది లేదని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హెచ్చరించారు. తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలం మల్లెనిపల్లి గ్రామంలో శుక్రవారం "రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’’ కార్యక్రమాన్ని పెద్దారెడ్డి ప్రారంభించారు. కూటమి మ్యానిఫెస్టోను వివరిస్తూ ఏడాదిగా ప్రజలకు ఎంత మేరకు నష్టం జరిగిందో క్యూ ఆర్ కోడ్ సాయంతో ప్రజలకు ఆయన వివరించారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డి మాట్లాడుతూ.. ‘కూటమి ప్రభుత్వం ఏర్పాటై 13 నెలలు గడుస్తున్నా పథకాలను సీఎం చంద్రబాబు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ఇది ముమ్మాటికీ దగా ప్రభుత్వం. డైవర్షన్ పాలిటిక్స్, కక్ష సాధింపు చర్యలకు మాత్రమే చంద్రబాబు పరిమితమయ్యారు. పీ–4 అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ‘తల్లికి వందనం’ పథకానికి 85 లక్షల మందికి అర్హత ఉంటే 65 లక్షల మందికి ఇస్తామని చెప్పారని, అందులోనూ ఇంకా లక్షల మందికి వర్తింపజేయలేదు. వైయస్ జగన్ ప్రశ్నిస్తే తప్పా ఈ ప్రభుత్వంలో చలనం రావడం లేదు. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం దారుణం. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేయాల్సిందే, లేకుంటే ఊరుకునేది లేదు. కూటమి ప్రభుత్వం మెడలు వంచైనా ప్రజలకు న్యాయం చేస్తాం’ అని పెద్దారెడ్డి పేర్కొన్నారు.