కానిస్టేబుల్పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

తిరుపతి జిల్లా: శ్రీకాళహస్తి పట్టణంలో కానిస్టేబుల్ పై దాడి ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధు సూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే సతీమణి డ్రైవర్ బైక్ ఆపిన పాపానికి ఓ కానిస్టేబుల్ను ఇంటికి పిలిపించి మరీ థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనను మాజీ ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. బియ్యపు మధు సూదన్ రెడ్డి మాట్లాడుతూ.. `రాష్ట్రంలో బీహార్ తరహా పాలన అరాచక పాలన సాగుతోంది. శ్రీకాళహస్తి రూరల్ సి. ఐ దగ్గరుండి కానిస్టేబుల్ పై దాడి చేయించారు. శ్రీకాళహస్తి రూరల్ సి. ఐ పై చర్యలు తీసుకోవాలి. కానిస్టేబుల్ కొడుకు అని గర్వం గా చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఈ దాడిపై స్పందించాలి. ప్రశ్నిస్తా అని చెప్పే పవన్ కళ్యాణ్ కానిస్టేబుల్పై జరిగిన అఘాయిత్యానికి ఏం సమాధానం చెబుతారు. ఈరోజు కానిస్టేబుల్ కుటుంబం బయటకు రావాలంటేనే భయపడుతోంది..వారికి రక్షణ కల్పించాలి. రాష్ట్రంలో ప్రారంభమైన ఈ దాడి క్యాన్సర్ లా ప్రతి నియోజకవర్గానికి వ్యాపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 276 కేసులు నమోదు చేశారు. వీటిపై హోం మంత్రి ప్రత్యేక బృందం తో విచారణ జరిపించాలి` అని మాజీ ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి డిమాండ్ చేశారు.