భవిష్యత్ రాజకీయ పోరాటాలకు సిద్ధంకండి
మార్కాపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భవిష్యత్ రాజకీయ పోరాటాలకు సిద్ధంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఇంచార్జి అన్నా రాంబాబు పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచే పార్టీని మరింత బలోపేతం చేయడం ద్వారా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడాలని సూచించారు. మార్కాపురం నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీల నియామక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా బుధవారం పొదిలి పట్టణంలోని 17వ వార్డును అన్నా రాంబాబు పర్యటించారు.
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించిన ఆయన, గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలంగా నిలబెట్టేందుకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతంలో ప్రతి కార్యకర్త పాత్ర అత్యంత కీలకమని, గ్రామ స్థాయి నుంచే ప్రజలతో బలమైన అనుబంధం పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అదేవిధంగా, 17వ వార్డుకు సంబంధించిన కొత్త వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలను ప్రకటించారు. పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయాలని సూచించారు.