అంబటి కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పరామర్శ
గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబు స్వగృహంపై ఇటీవల జరిగిన దాడిని మాజీమంత్రి, శ్రీసత్యసాయిజిల్లా వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ తీవ్రంగా ఖండించారు. బుధవారం అంబటి రాంబాబు కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ, ఈ దాడి రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు నిదర్శనమన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేయడమే అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. అంబటి రాంబాబు వంటి ప్రజాదరణ కలిగిన నేత ఇంటిపై దాడి వెనుక ప్రభుత్వ, పోలీస్ వ్యవస్థ వైఫల్యమే అన్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట రాష్ట్ర వాల్మీకి విభాగ అధ్యక్షులు పొగాకు రామచంద్ర, పెనుకొండ నియోజకవర్గ వైయస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు.