రైతులను కాల్చి చంపింది, గుర్రాలతో తొక్కించింది చంద్రబాబే కదా..
అసెంబ్లీ: రైతుల గురించి, రైతు సంక్షేమం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. బషీర్బాగ్లో రైతులను కాల్చి చంపింది ఎవరు..? అని ప్రశ్నించారు. చంద్రబాబు, టీడీపీ నేతలపై అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి కన్నబాబు ధ్వజమెత్తారు. నిడదవోలు కాల్దరి గ్రామంలో రైలు పట్టాలపై ధర్నా చేస్తున్న రైతులపై కాల్పులు జరిపితే ఇద్దరు రైతులు చనిపోయారని గుర్తుచేశారు. ఏలూరు కలెక్టరేట్లో రైతులపై చంద్రబాబు లాఠీచార్జ్ చేయించారని, హైదరాబాద్లో రైతులను గుర్రాలతో తొక్కించారని మండిపడ్డారు. 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ అమలు చేసినప్పుడు లెఫ్ట్ పార్టీలు చంద్రబాబును ప్రపంచ బ్యాంకు జీతగాడు అన్నాయని గుర్తుచేశారు. విద్యుత్ బిల్లులు కట్టలేదని మెదక్, మహబూబ్నగర్ జిల్లాలో రైతులకు సంకెళ్లు వేసి వ్యానులో తరలించిన చరిత్ర చంద్రబాబుదన్నారు. రైతులను రోజుల తరబడి జైళ్లలో పెట్టించాడని గుర్తుచేశారు. పార్టీలు మారటం గురించి అచ్చెన్నాయుడు మాట్లాడటం హ్యాస్పదమన్నారు. ఇటీవల పార్టీ లేదు.. బొక్కా లేదు అన్న వ్యక్తి అచ్చెన్నాయుడు అని గుర్తుచేశారు. చంద్రబాబు పుట్టుక కాంగ్రెస్ అని, టీడీపీలో చేరి పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు చేతికి అందని ఏకైక పార్టీ వైయస్ఆర్ సీపీ మాత్రమేనన్నారు.