అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదు
నెల్లూరు జిల్లా: అక్రమ కేసులకు భయడే ప్రసక్తి లేదని వైయస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల నెల్లూరు జిల్లా కోవూరు, గుమ్మలదిబ్బ ప్రాంతంలో మైనర్ బాలిక మృతి ఘటనపై ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించినందుకు తనపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. మైనర్ బాలిక మృతి ఘటనకు సంబంధించి బాలిక ఇంటి వద్దకు వెళ్లే సమయంలో టిడిపీ కార్యకర్తలు దాడికి పాల్పడే ప్రమాదం ఉందని చెప్పాను. అయితే, పోలీసులే ఈ ఘటనపై ఫోక్సో కేసు నమోదు చేశారని ఆక్షేపించారు. గంజాయి మత్తులో ఏర్పడే అఘాయిత్యాలను ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో గంజాయి సరఫరా యథేచ్ఛగా జరుగుతున్నదని అన్నారు. ఫోక్సో చట్టంపై తమకు అవగాహన ఉందని, మృతి చెందిన బాలిక పేరు లేదా ఇతర వ్యక్తిగత వివరాలను ఎక్కడా ప్రస్తావించలేదని స్పష్టం చేశారు.
కాకాణి పూజీతపై కూడా అదే సందర్భంలో అక్రమ కేసు నమోదు అయినట్టు కాకాణి గోవర్ధన్రెడ్డి చెప్పారు. ఎన్ని కేసులు మోపినా, ప్రభుత్వాన్ని, పోలీసుల చర్యలను ప్రశ్నించడం మానుకోమని ఆయన తెలిపారు. శ్రీవారి లడ్డుపై అసత్య ఆరోపణలు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ పై తగిన చర్యలు తీసుకోవాలని కాకాణి డిమాండ్ చేశారు.