కూటమి ప్రభుత్వ వంచనపై ఇంటింటా ప్రచారం
విశాఖపట్నం: ఎన్నికల మందు ఎన్నో హామీలు గుప్పించి, వాటిపై ఇంటింటికీ హామీలు, సంతకాలతో బాండ్లు పంపించి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా అమలు చేయకుండా చేసిన మోసంపై రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటా సీఎం చంద్రబాబు తీరును ఎండగడతామని వైయస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ఆ దిశలో ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ రూపొందించాయని, 5 వారాల్లో.. రీజినల్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఇంటింటా ప్రభుత్వ వంచనను ప్రచారం చేస్తామని విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి అమర్నాథ్ తెలిపారు.
ప్రెస్మీట్లో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏం మాట్లాడారంటే..:
గతంలోనూ మ్యానిఫెస్టో మాయం:
కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన, ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు. ప్రతిపక్షం టార్గెట్గా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తోంది. ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్తో కాలం వెళ్లదీస్తోంది. సూపర్ సిక్స్ పేరుతో అడ్డగోలు హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కూటమి, వాటిని అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. ఎన్నికలకు ముందు గెలవడం కోసం ఇష్టారాజ్యంగా సాధ్యం కాని హామీలివ్వడం.. అధికారంలోకి వచ్చాక పచ్చిగా మోసగించడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. గతంలోనూ 2014–19 మధ్య ఇలాగే హామీలిచ్చి అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను వంచించడమే కాకుండా పార్టీ వెబ్సైట్ నుంచి ఏకంగా మ్యానిఫెస్టో తొలగించిన నీచ చరిత్ర తెలుగుదేశం పార్టీది.
ఐదు విడతల్లో బాబు ష్యూరిటీ. మోసం గ్యారెంటీ:
ఏడాది పాలనలో ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయకుండానే సూపర్సిక్స్ అమలు చేశామని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. పైగా సూపర్ సిక్స్ గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వారికి నాలుక మందం అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. సూపర్ సిక్స్ హామీల గురించి వైయస్సార్సీపీ నాయకులు ప్రశ్నించకూడదట. మా నాయకులు వైయస్ జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తామని చంద్రబాబు బెదిరింపులకు దిగుతున్నాడు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ ఆదేశాలతో బాబు ష్యూరిటీ. మోసం గ్యారెంటీ అనే నినాదంతో ఐదు వారాల కార్యక్రమానికి వైయస్సార్సీపీ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో ఇంటింటా కూటమి మ్యానిఫెస్టోతో పాటు, నాడు చంద్రబాబు సంతకం, ప్రమాణ పత్రంతో పంపించిన బాండ్ చూపి ప్రభుత్వ వంచనను వివరిస్తాం. ఎన్నికల్లో మోసపు హామీలిచ్చి ప్రజలను ఏ విధంగా మోసగించారో తెలియజేస్తాం.
‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ అంటూ 2024 కూటమి పార్టీల ప్రజాగళం మ్యానిఫెస్టోను క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని రూపొందించాం. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూటమి మేనిఫెస్టోతో పాటు రాష్ట్ర ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని త్రికరణ శుద్ధితో నిలబెట్టుకుంటానని ప్రమాణం చేస్తూ ఐదు కోట్ల మందికి ఇచ్చిన గ్యారెంటీ బాండ్లను కూడా ఈ సందర్భంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
మొదటి వారం రీజినల్ కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో, రెండో వారం నియోజకవర్గ కేంద్రాల్లో, ఆ తర్వాత మండల కేంద్రాల్లో, తర్వాత గ్రామ స్థాయిలో ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజల్లోకి తీసుకెళతాం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలన్నీ అమలు చేసేదాకా ఒత్తిడి తెస్తాం.
‘సూపర్ సిక్స్’ తొలి ఏడాది మోసం విలువ రూ.81 వేల కోట్లు:
గత ఎన్నికల ముందు కూటమి ఆర్భాటంగా ప్రకటించిన సూపర్ సిక్స్లో అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 50 ఏళ్లకు పింఛన్ హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. దీపం పథకాన్ని ఒక సిలిండర్కే పరిమితం చేశారు. 30 లక్షల మందికి తల్లికి వందనం పథకాన్ని ఎగరగొట్టేశారు. మొత్తంగా కూటమి పాలన తొలి ఏడాదిలో సూపర్ సిక్స్ ఫథకాలు అమలు చేయకుండా రూ.81 వేల కోట్ల మేర ఆయా పథకాల లబ్ధిదారులను చంద్రబాబు మోసగించారు. ఇవి కాకుండా ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల పేరుతో చేసిన మోసం అదనం.
యోగాంధ్ర పేరుతో విశాఖ పేరును రోడ్డుకీడ్చారు:
ఇటీవల ప్రభుత్వం చాలా ఆర్భాటంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం విశాఖపట్నం పేరును రోడ్డున పడేసింది. రికార్డుల కోసం గిరిజన బిడ్డలను ఇబ్బంది పెట్టారు. ఇంకా చనిపోయిన వారి పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించి, వారు యోగాసనాలు వేసినట్టు సిగ్గు లేకుండా ప్రచారం చేసుకున్నారని గుడివాడ అమర్నాథ్ చురకలంటించారు.