తెనాలి ఘటనకు హోంమంత్రి బాధ్యత వహించాలి
ప్రకాశం జిల్లా: తెనాలిలో పోలీసులు బరితెగించి దళిత, మైనార్టీలు, బడుగులపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటనకు రాష్ట్ర హోం మంత్రి అనిత బాధ్యత వహించాలని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ నేత ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తెనాలి నడి వీధిలో పోలీస్ లాఠీ ఛార్జీ ఘటనను ఆదిమూలపు సురేష్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ముగ్గురు దళిత, మైనారిటీ యువకులను బహిరంగంగా నలుగురూ చూస్తుండగానే కర్కశంగా లాఠీతో కొట్టడం దుర్మార్గమన్నారు. యువకులను రోడ్డుపై కూర్చోబెట్టి.. ఇద్దరు పోలీసు అధికారులు లాఠీలతో విచక్షణారహితంగా చితకబాదిన వీడియో చూస్తుంటే ప్రతి ఒక్కరికీ ఒళ్లు గగుర్పొడుస్తోందన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ ర్యాజ్యాగం శృతి మించిందని మండిపడ్డారు. దళిత యువకులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై జాతీయ ఎస్సి కమిషన్ ,మానవ హక్కుల కమిషన్ ని ఆశ్రయిస్తామని ఆదిమూలపు సురేష్ తెలిపారు.