చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసమే రాజధాని అమరావతి
అనంతపురం: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వార్థ ప్రయోజనాల కోసమే అమరావతిలోనే రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తున్నాడని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఏపీలో పరిపాలన వికేంద్రీకరణ – మూడు రాజధానులకు మద్దతుగా అనంతపురం కలెక్టరేట్ వద్ద మేధావులు, ప్రజా సంఘాలు సంకల్ప దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు విశ్వేశ్వరరెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జడ్పీ చైర్మన్ గిరిజమ్మ, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రమణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు పై విశ్వేశ్వరరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఈరోజు తిరుపతిలో జరుగుతున్న అమరావతి సభ చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతోందన్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ యే అడ్డని విమర్శించారు. నాడు శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కనపెట్టి అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశారన్నారు. అమరావతి ఒక వర్గానికే చెందిన రాజధాని అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి ఒక్కటే కాదు.. 13 జిల్లాలని పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతం తీవ్రంగా వెనుకబడి ఉందని, ఈ ప్రాంత ప్రజల మనోభావాలు, అవసరాలను గుర్తించాలని కోరారు. రాజధాని పేరిట చంద్రబాబు అమరావతిలో రియల్ ఎస్టేట్ను ప్రోత్సహిస్తున్నారని విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు.