గిరిజనులంతా పండుగ చేసుకునే రోజు
అమరావతి: గిరిజనులకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారని, గిరిజనుల అభిప్రాయాన్ని గౌరవించి బాక్సైట్ తవ్వకాలను రద్దు చేశారని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అన్నారు. సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గిరిజనుల కోరిక మేరకు బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తూ సీఎం వైయస్ జగన్ ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. ఇవాళ గిరిజనులంతా పండుగ చేసుకునే రోజు అని, సీఎం వైయస్ జగన్ను ఎప్పటికీ మరిచిపోరన్నారు. గత ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు గిరిజన సంపదను దోచుకునేందుకు యత్నించారన్నారు. బాక్సైట్ తవ్వకాల కోసం వైయస్ఆర్ సీపీలో గెలిచిన ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేశాడని గుర్తు చేశారు. 2015లో చంద్రబాబు ఇచ్చిన జీఓకు వ్యతిరేకంగా వైయస్ జగన్ పోరాటం చేశారని, వైయస్ఆర్ సీపీ అధికారంలోకి వస్తే బాక్సైట్ తవ్వకాల అనుమతులు రద్దు చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి అయిన నాలుగు నెలల్లోనే గిరిజనులకు ఇచ్చిన మాటను వైయస్ జగన్ నిలబెట్టుకున్నారన్నారు. వైయస్ జగన్పై ఉన్న నమ్మకంతోనే గిరిజన ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థులను ప్రజలు గెలిపించారన్నారు.