బాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు

7 Jan, 2020 17:56 IST

అమరావతి: చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిలిగిపోవడం ఖాయమని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా అన్నారు. ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ గూండాలు హత్యాయత్నంకు పాల్పడిన తీరును ప్రజలంతా చూశారన్నారు. రైతుల రూపంలో టీడీపీ గూండాలను ప్రేరేపించి ఒక ప్రజాప్రతినిధిపై హత్యాయత్నంకు పాల్పడడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు కచ్చితమైన చర్యలు తీసుకోవాలన్నారు. గత ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించినా చంద్రబాబు బుద్ధి మారలేదన్నారు. చంద్రబాబు రోజు రోజుకు మరింత దిగజారిపోయి సిగ్గుమాలిన పనులకు పాల్పడుతున్నారన్నారు. ఈ రోజు దేశంలో నంబర్‌ వన్‌ యాంటీ సోషల్‌ ఎలిమెంట్‌ చంద్రబాబేనన్నారు. అమరావతి ప్రాంతంలో లెజిస్లేచర్‌ క్యాపిటల్‌ ఉండకూడదనే చంద్రబాబు ఇలాంటి కుట్రలను చేస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు చంద్రబాబు రాని ఆవేశం ఈ రోజు మూడు రాజధానులు అంటే ఎందుకు వస్తుందని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా ప్రశ్నించారు. చంద్రబాబు ఆవేశం వెనుక ఆయన బినామీలకు చెందిన భూముల విలువలు తగ్గిపోతున్నాయనే బాధ తప్ప వేరేవి పట్టించుకోరని ఎద్దేవా చేశారు. ఒక దళిత ఐఏఎస్‌ అధికారి పట్ల చంద్రబాబు అవమానకరంగా మాట్లాడారని, ఈ వ్యవహారంపై దళిత సంఘాలు బాబును ఛీ కొడుతున్నాయన్నారు. అమరావతిని నిర్మించాలంటే రూ. 1.10 లక్షల కోట్లు కావాలని, ప్రస్తుతం అంత డబ్బు ఖర్చు చేసే పరిస్థితి రాష్ట్రంలో లేదు కాబట్టే.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకువచ్చామన్నారు.   ఏ కారణంతో చనిపోయినా రాజధాని కోసమే చనిపోయారంటే చంద్రబాబు శవరాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. అన్ని ప్రాంతాలకు సమగ్రాభివృద్ధి, సమన్యాయం కోసమే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రయత్నిస్తున్నారన్నారు.