ఇష్టానుసారం మాట్లాడితే సహించం..
గుంటూరు: రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అటు ఇటు కాని దద్దమ్మ అని వైయస్ఆర్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు మేరుగ నాగార్జున నిప్పులు చెరిగారు. గుంటూరు పట్టాభిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన పార్టీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డితో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఖూనీ కోరులని ముద్ర వేయించుకున్న వ్యక్తులు, ఇసుక స్మగ్లర్లు, కీసర బ్రిడ్జిని ఇనుము ముక్కలా అమ్ముకున్న దుర్మార్గులు, వదిన చావుకు కారణమైన వ్యక్తులు.. వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డిలపై వ్యాఖ్యలు చేయటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఈ కొద్ది రోజుల వ్యవధిలో అయిన వారికి దోచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మరో వైపు ఇసుక దోపిడీలు చేసే మంత్రి దేవినేని ఉమా, క్రైస్తవ ఆస్తులను దోచుకునే మరో మంత్రి నక్కా ఆనంద్బాబు మాట్లాడుతున్న తీరు సిగ్గుచేటని మండిపడ్డారు.
అవినీతికి కేంద్ర బిందువులైన మంత్రుల్లో ప్రథమ స్థానంలో ఉన్న ఉమా ఉన్నారని, ఆలీబాబా నలభై దొంగల్లో ప్రథముడు ఆయనేనని చెప్పారు. 2018 నాటికల్లా పోలవరం పూర్తి చేస్తామని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికిన దేవినేని ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. ఇష్టానుసారంగా వైయస్ఆర్సీపీ నేతలపై నోరు పారేసుకుంటే తగిన బుధ్ధి చెబుతామని హెచ్చరించారు.
వక్రభాష్యాలు పలకటం సిగ్గుచేటు: లేళ్ల అప్పిరెడ్డి
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో విచిత్ర పరిస్ధితులు దాపురించాయని, వేసవి సెలవులకు వెళితే.. పారిపోయారని వైఎస్ జగన్పై వ్యాఖ్యలు చేయటం, వక్రభాష్యాలు పలకటం సిగ్గుచేటని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఓడిపోతామన్న భయంతో అధికారులు, వైయస్ఆర్సీపీపై లేనిపోని అభాండాలు మోపుతున్న చంద్రబాబు సర్కార్కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. గుంటూరు నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్గాంధీ మాట్లాడుతూ నైతిక విలువలు ఏ మాత్రం లేకుండా టీడీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు.