ఠంచన్గా ‘వైయస్ఆర్ పెన్షన్ కానుక’ పంపిణీ
తాడేపల్లి: రాష్ట్రవ్యాప్తంగా ‘వైయస్ఆర్ పెన్షన్ కానుక’ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే వలంటీర్లు ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలో 60.80 లక్షల మందికి పెన్షన్ లబ్ధిదారులు ఉండగా.. వారికోసం రూ.1420.48 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. 2.66 లక్షల మంది వలంటీర్ల ద్వారా శుక్రవారం ఉదయం నుంచి పెన్షన్ల పంపిణీ జోరుగా సాగుతోంది.
బయోమెట్రిక్, ఐరిస్ విధానం అమలు
లబ్ధిదారుల గుర్తింపు కోసం బయోమెట్రిక్, ఐరిస్ విధానాలను అమలుచేస్తున్నామని, అలాగే.. ఆర్బీఐఎస్ విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఎవరైనా తమ సొంత నివాసం నుండి ఇతర ప్రాంతాలకు వైద్యం లేదా ఇతర కారణాలతో ఆరు నెలలు ఊరెళ్లిన వారికి కూడా, వారు ఉండే చోటే పెన్షన్ అందించే ఏర్పాట్లు చేసినట్లు ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికీ పెన్షన్ అందలేదనే ఫిర్యాదు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. పెన్షన్ పంపిణీని మూడ్రోజుల్లో నూరుశాతం పూర్తయ్యేలా వలంటీర్లను ఆదేశించామన్నారు.