విజయనగరం: పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఊరేగింపుగా వెళ్లి పైడితల్లి అమ్మవారికి మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని, తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అనంతరం మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రకు పరిపాలన రాజధాని వచ్చేలా చెయ్యాలని అమ్మవారిని వేడుకున్నట్టు చెప్పారు. వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని శివ రామకృష్ణన్ కమిటీ కూడా చెప్పిందని గుర్తుచేశారు. హైదరాబాద్లా ఒకేచోట అభివృద్ధి కేంద్రీకృతమైతే నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం వైయస్ జగన్ భావిస్తున్నారన్నారు. చంద్రబాబు అమరావతిలో రియల్ ఎస్టేట్ మాఫియాని తయారు చేశాడని, ఫేక్ రైతులతో ఫేక్ పాదయాత్ర చేయిస్తున్నాడని మండిపడ్డారు.