శ్రీకాకుళం: అన్ని జిల్లాల అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష అని, ఆ దిశగానే వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. కరోనా కష్టకాలంలోనూ అనేక సంక్షేమ పథకాలను సీఎం అమలు చేస్తున్నారన్నారు. శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, తనకు ఓటు వేయకపోయినా ప్రభుత్వ పథకాలు అందించండి అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని గుర్తుచేశారు. గతంలో చంద్రబాబు పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, గత ఐదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కరోనా వైరస్పై సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం అలుపెరగని యుద్ధం చేస్తోందని మంత్రి ధర్మాన గుర్తుచేశారు. ఈనెల 17, 18, 19న జిల్లాలో కరోనా సమీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్య, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నామన్నారు.