రెడ్‌బుక్ రాజ్యాంగానికి లోబడి పోలీసులు పనిచేస్తున్నారు

27 May, 2025 16:33 IST

తెనాలి: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగానికి లోబడే పోలీసులు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుని పనిచేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. తెనాలి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ నేతలు మాజీ మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ ఎం. అరుణ్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌లు మీడియాతో మాట్లాడుతూ తెనాలి పట్ణణంలో ముగ్గురు యువకులపై మానవహక్కులను ఉల్లంఘిస్తూ పోలీసులు నడిరోడ్డుపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించి హింసించడాన్ని తీవ్రంగా ఖండించారు. దళిత, మైనార్టీ యువకుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుతో మొత్తం సమాజంలోని బడుగువర్గాలు ఆందోళన చెందుతున్నాయని అన్నారు. ఈ రాష్ట్రంలో దళిత, మైనార్టీలకు భద్రత లేదా అని ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఏడాది కూటమి పాలనలో నిత్యం దళితులు, బహుజనులు, మైనార్టీలపై అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని, దానికి తాజాగా తెనాలిలో జరిగిన ఘటనే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెవరు ఏమన్నారంటే...   

రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది:   మాజీ మంత్రి మేరుగు నాగార్జున 

తెనాలి పట్టణంలో ముగ్గురు యువకులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. వారు ఏదైనా తప్పు చేస్తే, వారిని శిక్షించే బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉంది. కూటమి ప్రభుత్వం అణగారినవర్గాల పట్ల కర్కషంగా వ్యవహరిస్తున్న తీరును తెనాలిలోని పోలీసులు ప్రతిబింభించారు. ఎన్‌సీఆర్‌బి వివరాలు ప్రకారం దేశంలో దళితులపై జరుగుతున్న దాష్టీకాలు ఏపీలోనే అధికంగా జరుగుతున్నాయి. ఏకంగా ఈ దేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పలుగులతో పొడిపించిన దుర్మార్గమైన ప్రభుత్వం నేడు ఏపీలో ఉంది. దళిత ఐపీఎస్‌ ఆఫీసర్లను సస్సెండ్‌ చేసి, నడిరోడ్డుపై నిలబెట్టారు. సునీల్ కుమార్, సంజయ్‌ లను రాజకీయ కక్షతో ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నారో ప్రజలు అంతా గమనిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళితులపై దాడులు కనిపిస్తూనే ఉన్నాయి. ఎంతగా బరితెగించారంటే ఒక దళిత ఎమ్మెల్యేతో దళితులు గంజాయి తాగేవారు అని అనిపించారంటే అణగారిన వర్గాల పట్ల కూటమి ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతోంది. అనంతపురం జిల్లా ఉరవకొండలో దళితుల మీద జరిగిన దాడి తీరు, కర్నూలు జిల్లా ఆదోని మండలంలో దళిత మహిళను ట్రాక్టర్‌తో తొక్కించిన తీరు, కూటమి ఎమ్మెల్యే నానాజీ ఒక దళిత వైద్యుడి చెంపపై కొట్టిన పరిస్థితి, నందికొట్కూరులో ఒక వ్యక్తిని నేరుగా లాకప్‌డెత్ ఇలా అనేకం చేశారు. రాజంపేట మున్సిపల్ చైర్మన్ రాంబాబును బహిరంగంగా అపహాస్యం చేసిన ఘటన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ నియోజకవర్గం పిఠాపురంలో దళితులను బహిష్కరణ వరకు వారి అరాచకాన్ని ప్రజలు చూశారు. పల్నాడు జిల్లాలో దళిత స్త్రీని అపహాస్యం చేస్తే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. అలాగే సామాజిక సమస్యలపై స్పందించిన దళిత యువకుడిని రాజమండ్రిలో పోలీసులు దుస్తులు విప్పించి లాకప్‌లో పెట్టి అవమానించారు. పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి. రాజధాని ప్రాంతంలో భూములు లాక్కుని దళితులను వేధిస్తున్నారు. మాజీ ఎంపి నందిగం సురేష్‌ను తప్పుడు కేసులతో జైలుకు పంపారు. మదనపల్లిలో దళితుల నివాసాలపై దాడులు చేశారు. నగిరిలో దళితులపై దాడులు చేసి, వారిని వెలివేశారు. ఇటువంటి అనేక సంఘటనలు గత ఏడాది కాలంగా జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వీటికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? చట్టాలను నడిపే వ్యవస్థలను తమ జేబు సంస్థలుగా చేసుకున్నారు. చట్టప్రకారం తప్పు చేసిన వారిని శిక్షించాల్సింది పోయి, నడిరోడ్డుపై లాఠీలతో బాదుతూ, వీడియోలు తీసి, చట్టాలను అపహాస్యం చేస్తారా? బడుగు, బలహీనవర్గాలపై ఇంత దారుణమైన దాష్టీకాలకు పాల్పడుతుంటే, ఏ ధైర్యంతో దళిత, బహుజనులు ధైర్యంగా ఈ రాష్ట్రంలో బతకగలరు? తెనాలిలో జరిగిన సంఘటన చూసి మొత్తం దేశం అంతా సిగ్గు పడుతోంది. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. చట్టప్రకారం ఇటువంటి ఘటనకు బాధ్యులైన వారిపై న్యాయ పోరాటం చేస్తామని మాజీ మంత్రి మేరుగు నాగార్జున స్పష్టం చేశారు. 

దళిత, మైనార్టీల ఆత్మగౌరవాన్ని కాలరాస్తుంటే సహించం: ఎమ్మెల్సీ ఎం.అరుణ్‌కుమార్

తెనాలిలోని ముగ్గురు యువకులను వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పోలీసులు చేసిన థర్డ్‌డిగ్రీ దారుణం. రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగానే పోలీసులు ఇటువంటి దాష్టీకానికి పాల్పడ్డారు. ఈ రాష్ట్రంలో దళిత, మైనార్టీలకు జీవించే హక్కు, ఆత్మగౌరవంతో బతికే హక్కు లేదా? వారిని పశువులను కొట్టినట్లు నడిరోడ్డుపై కొట్టే హక్కు ఈ రాష్ట్ర పోలీసులకు ఏ రాజ్యాంగం ఇచ్చింది? రెడ్‌బుక్ రాజ్యాంగంలో దళితులు, మైనార్టీలను ఇలాగే హింసించాలని ఉందా? ఇటువంటి అమానవీయ సంఘటన జరిగినప్పుడు కనీసం దళిత హోం మంత్రి కూడా ఎందకు స్పందించలేదు? థర్డ్ డిగ్రీ అమలు చేయకూడదని న్యాయవ్యవస్థ, రాజ్యాంగం చెబుతోంది. ముగ్గురు యువకులను పోలీసులు అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకుని కొడుతూ, వాటిని వీడియోలు తీసి ఎవరికి పంపారు? దీనికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఈ ఘటనను చూసి ఈ రాష్ట్రంలోని దళితులు, మైనార్టీలు అభద్రతాభావంకు గురవుతున్నారు. ఏడాది కాలంగా అనేక సంఘటనలు ఇలాంటివే వరుసగా జరుగుతున్నాయి. పోలీసులు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు ప్రతిపక్షం మీదనే ప్రయోగించడం చూశాం. ఇప్పుడు తాజాగా దళిత, మైనార్టీలకు కూడా వర్తింప చేస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన పోలీసులపై విచారణ జరిపించాలి. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగవనే భరోసా దళిత, మైనార్టీలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం.


కూటమి పాలనలో వ్యవస్థలు అస్తవ్యస్తం :  మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌

తెనాలిలో జరిగిన ఘటనను మొత్తం రాష్ట్ర ప్రజలంతా మీడియా మాధ్యమం ద్వారా చూశారు. తెనాలి సెంటర్‌లో నడిరోడ్డుపై పట్టపగలు ముగ్గురు యువకులను, విచక్షణారహితంగా హింసించింది ప్రజలు చూశారు. సభ్య సమాజంలో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి. ప్రజలకు న్యాయ, సామాజిక రక్షణను కల్పించాల్సిన పోలీస్ వ్యవస్థ చట్టాలను తన చేతుల్లోకి తీసుకుంటే ఎటువంటి అరాచకం ఏర్పడుతుందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. గత అయిదేళ్ళలో వైయస్ఆర్‌సీపీ పాలనలో ప్రజలకు రక్షణ కల్పించే విషయంలోనూ, చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలనే అంశంలోనూ ఎక్కడా గీత దాటలేదు. అన్ని వ్యవస్థలను కూడా చట్టాల పరిధిలోనే పనిచేసేలా చాలా స్పష్టమైన ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వంలో అన్ని చట్టాలు చట్టుబండలు అయ్యాయి. పోలీసులకే చట్టాల పట్ల ఎటువంటి గౌరవం లేకుండా పోయింది. తెనాలిలో యువకులపై పోలీసులు వ్యవహరించిన తీరు మొత్తం సమాజమే భయాందోళనలకు గురయ్యేలా ఉంది. నిజంగా ఆ యువకులు తప్పు చేస్తే వారిని చట్ట పరిధిలో న్యాయస్థానాల ముందు నిలబెట్టి శిక్షించాలే తప్ప, చట్టాలను తమ చేప్పుచేతల్లోకి తీసుకుని, వారి మనోభావాలు దెబ్బతినేలా హింసించడం దారుణం. ఒక సీఐ స్థాయి అధికారి తన బూట్ కాలుతో సదరు యువకుల కాళ్ళపై నొక్కి పెట్టడం, మరో సీఐ స్థాయి అధికారి వారిని లాఠీలతో చావబాదడం చూస్తుంటే, ఈ సమాజానికి వీరు ఏం మెసేజ్ ఇస్తున్నారో అర్థం కావడం లేదు. పైగా తాము పబ్లిక్‌గా చేస్తున్న థర్డ్‌డిగ్రీని పోలీసులే వీడియో తీసి, వాటిని వారే సోషల్ మీడియాలో పెట్టడం మరింత విస్మయం కలిగిస్తోందని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. 

మీడియా సమావేశంలో వైయస్ఆర్‌సీపీ నేతలు మందపాటి శేషగిరిరావు, కొమ్మూరి కనకారావు, వరికూటి అశోక్‌బాబు, కాకుమాని రాజశేఖర్‌, బలసాని కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.