తాడేపల్లి: గ్రామ సచివాలయ వ్యవస్థ... అదొక అద్భుతమైన వ్యవస్థ అనే చెప్పాలి... 50 కుటుంబాలకు ఒక వాలంటీర్. వీరిలో ఏ అవసరం వచ్చినా నేరుగా ప్రభుత్వానికి నివేదించే వారధి. ప్రభుత్వ పథకాల ధరఖాస్తు దగ్గర్నుంచి, వాటి అమలు వరకు గ్రామస్థాయిలో నిర్వహించేది వాలంటీరే. అలాంటి మహత్తర వ్యవస్థ తీరుతెన్నులను ఐక్యరాజ్యసమితి గుర్తించింది. సచివాలయాల్లో మరో ముందడుగు పడింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా కరెంట్ బిల్లులు చెల్లింపు వంటి పలు సేవలను నగదు రహితంగా నిర్వహించే వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాలయాల్లో డిజిటల్ లావాదేవీలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దీంతో కుగ్రామాల్లో ఉండే సచివాలయాల్లో సైతం డిజిటల్ లావాదేవీలు అందుబాటులోకి వచ్చినట్టు అవుతుందని... దీని వల్ల మన రాష్ట్రంలో మరో సాంకేతిక విప్లవం వచ్చినట్టేనని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మొబైల్ ద్వారా అత్యంత సులభంగా, సురక్షితంగా, తక్షణమే చెల్లింపు ప్రక్రియ జరిపేలా ప్రతి సచివాలయానికి క్యూఆర్ కోడ్ను కేటాయించనున్నారు.
► నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ), కెనరా బ్యాంక్ల సహకారంతో సచివాలయాల్లో యూపీఐ చెల్లింపుల సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది.
► గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం 543 రకాల సేవలను ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెలిసిందే. వినియోగదారులు ఇక నుంచి ఈ సేవలను అవసరమైతే డిజిటల్ పేమెంట్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు.
► సచివాలయాల్లో ప్రతి నగదు రహిత లావాదేవీ జరిగిన వెంటనే సంబంధిత వినియోగదారుడి మొబైల్ నంబర్కు ఎస్ఎంఎస్ వస్తుంది.