చంద్రబాబు సుప్రీం ఆదేశాలను ఉల్లంఘిస్తున్నాడు
రాజమహేంద్రవరం: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అండ్ కో చేస్తున్న దుష్ప్రచారం చూసి శ్రీవారి భక్తులను బాధించడానికే చంద్రబాబుకి అధికారం వచ్చిందా అని రాష్ట్ర ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. లడ్డూకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు చేసిన ప్రచారం సీబీఐ సిట్ చార్జిషీట్తో అబద్ధమని తేలడంతో భక్తులంతా సంతోషంతో ఊపిరిపీల్చుకున్నారు. కానీ నివేదిక తనకు అనుకూలంగా రాలేదన్న కడుపుమంటతో చంద్రబాబు తిరుమల ప్రతిష్టను మంటగలిపేలా దిగజారి ప్రవర్తిస్తున్నాడు. లడ్డూ విషయంలో తాను చేసిన కుట్రలు బయటపడటంతో రాజకీయంగా నష్టపోయిన చంద్రబాబు.. తాను చేసిన ప్రచారమే నిజమని నమ్మించడానికి కొత్త కుట్రలకు తెరలేపాడు. బాత్రూమ్లు కడిగే రసాయనాలు లడ్డూకి వాడిన నెయ్యిలో కలిశాయని తిరుమల ప్రతిష్టకి భంగం కలిగించేలా మాట్లాడుతున్నాడు.
దేవుడితో ఆటలాడుతున్నాననే విషయం కూడా మరిచిపోయి రాజకీయ లబ్ధికోసం పాకులాడుతున్నాడు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నాడు. లడ్డూ గురించి మాట్లాడవద్దని న్యాయస్థానాలు హెచ్చరించినా సుప్రీం ఆదేశాలను సైతం ధిక్కరించి విషప్రచారం మొదలుపెట్టాడు. స్వామి వారిని నమ్మకున్న భక్తుల విశ్వాసంతో చంద్రబాబు ఆటలాడుకుంటున్నాడు. ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పుని అంగీకరించి భక్తులకు క్షమాపణలు చెప్పాలని చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు.