పరుగులు పెడుతోన్న `పోలవరం` పనులు

11 May, 2021 13:56 IST

ప‌శ్చిమ గోదావ‌రి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. వైయ‌స్ జ‌గ‌న్ స‌ర్కార్‌ పోలవరం ప్రాజెక్టును ఓ యజ్ఞం చేపడుతోంది. చంద్ర‌బాబు పాల‌న‌లో జరిగిన వైఫల్యాలు, లోపాలు, అక్రమాలు, అవకతవకలు సరిచేస్తూ వైయ‌స్ జగన్ సర్కారు ముందుకు దూసుకెళ్తోంది. వేలాది మంది కార్మికుల శ్రమైక్య సౌందర్యంతో పాటు ఆధునిక యంత్ర సామగ్రి, వేలాది టిప్పర్లు, లారీలు, యంత్రాల రణగొణ  ధ్వనుల మధ్య ఓ ప్రపంచ అద్భుత నిర్మాణంగా పోలవరం ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. వందలాది మంది నిపుణులు, ఇంజనీర్లు పర్యవేక్షణలో పనులు పరుగులు పెడుతున్నాయి. 

గత ప్రభుత్వాలు మాటలకు, గ్రాఫిక్స్ కే పరిమితమైతే, సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రభుత్వం మాత్రం గ‌త‌ రెండేళ్లుగా ప్రాజెక్టు ప‌నుల‌ను చేతల్లో చూపిస్తున్నారు. వరదలు వచ్చినా, కరోనా కలవర పెడుతున్నా  పోలవరం ప్రాజెక్ట్ పనులు మాత్రం రెట్టింపు వేగంతో కొనసాగుతున్నాయి. మేఘా ఇంజనీరింగ్ సంస్థ పక్కా ప్రణాళికకు తోడు రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల సహకారంతో నిర్మాణం అంచనాలను తలకిందులు చేస్తూ యుద్ధప్రాతిపతికన పనులు జరుగుతున్నాయి. చంద్రబాబు పోలవరాన్ని సోమవారంగా మార్చాను అని మొండి గోడలకు పరిమితం చేస్తే, వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఆంధ్రుల జీవనాడి తమ లక్ష్యంగా పనులు చేయిస్తోంది. 

రికార్డు స్థాయిలో మేఘా పనులు
పోలవరం ప్రాజెక్ట్ లో అంచనాలను మించి పనులు జరుగుతున్నాయి. గత ఏడాది కాలంలో అంటే ఏప్రిల్ 2020 నుంచి 2021 మార్చివరకు 12 నెలల కాలంలో 4,03,160 ఘనపు మీటర్ల కాంక్రీట్ పనిని ప్రభుత్వం ప్రతిపాదిస్తే మేఘా ఇంజనీరింగ్ 5,58,073 ఘనపు మీటర్ల కాంక్రీట్ పనిని పూర్తిచేసింది. గతేడాది మే, జూన్, ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలలో ఇంజనీరింగ్ నిపుణులు సైతం నివ్వెరపోయే విధంగా కాంక్రీట్ పని చేపట్టింది. గత సంవత్సరంలో మే నెలలో కరోనాను తట్టుకొని 53 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 85,300 క్యూబిక్ మీటర్ల పనిని పూర్తి చేసింది. అలాగే జూన్-2020లో 70 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే రికార్డు స్థాయిలో 1,20,100 క్యూబిక్ మీటర్ల పూర్తి చేసింది. అదేవిధంగా ఫిబ్రవరి 2021లో 47 వేల క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పనులు చేయాలని టార్గెట్ పెట్టుకుని 83 వేల క్యూబిక్ మీటర్ల పనులు చేసింది. ఈ సంవత్సరం మార్చి నెలలో 68,600 క్యూబిక్ మీటర్ల లక్ష్యం పెట్టుకోగా, 81,200 క్యూబిక్ మీటర్ల పనులు చేసి తనకు చాటి ఎవ్వరూ లేరు అని నిరూపించుకుంది మేఘా సంస్థ . ప్రతి నెలా అంచనాలను మించి కాంక్రీట్ పనులు చేస్తూ అనుకున్న లక్ష్యం దిశగా పోలవరం ప్రాజెక్ట్ సాగుతోంది. 

కాంక్రీట్ పని క్యూబిక్ మీటర్లలో
నెల                          జరిగిన పని              పని లక్ష్యం
ఏప్రిల్-2020లో            36783                     36783
మే-2020లో                  85300                     53263
జూన్-2020లో              1,20,100                 72215
జులై-2020లో               20800                     27798
ఆగష్టు-2020లో            14500                     6148
సెప్టెంబర్-2020లో       14670                    6444
అక్టోబర్-2020లో           20058                   17607
నవంబర్-2020లో         25997                   15691
డిసెంబర్-2020లో        19000                    23036
జనవరి-2021లో            36705                    28513
ఫిబ్రవరి-2021లో           82956                   47047
మార్చి-2021లో              81204                  68615
మొత్తం                         558073                 403160
    
తుది దశకు  స్పిల్ వే పనులు
ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ నిర్మాణం పూర్తితో తుది దశకు చేరింది. కాంక్రీట్ పనులు, గ్యాలరీలో గ్రౌటింగ్ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ప్రభుత్వ సంకల్పానికి తోడు, మేఘా ఇంజనీరింగ్ ప్రణాళికతో ఇప్పటి వరకు స్పిల్ వేలో 2,82,276 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసింది. స్పిల్ వే బ్రిడ్జికి ఏర్పాటు చేయాల్సిన 48 గేట్లకు గానూ 42 గేట్లను ఏర్పాటు చేశారు. ఈ గేట్లకు 96 హైడ్రాలిక్ సిలిండర్లు అమర్చాల్సి ఉండగా ఇప్పటికే 84 హైడ్రాలిక్ సిలిండర్లు అమర్చారు. మిగతా  12 సిలిండర్లు జర్మనీ నుంచి రావాల్సి ఉంది. అలాగే గేట్లను ఆపరేట్ చేయడానికి అవసరమైన 24 పవర్ ప్యాక్ లకు గానూ 13 పవర్ ప్యాక్ సెట్లను అమర్చారు. వీటితో 26 గేట్లను ఒకేసారి పైకి ఎత్తవచ్చు. ఒక్కో పవర్ ప్యాక్ సాయంతో రెండు గేట్లను నిర్వహించవచ్చు. పోలవరం స్పిల్ వేలో పది కి 10 రివర్ స్లూయిజ్ గేట్ల అమరిక ఇప్పటికే పూర్తయ్యింది. వాటికి అమర్చాల్సిన 20 హైడ్రాలిక్ సిలిండర్ల పనులు ముగిశాయి. వీటిని ఆపరేట్ చేయడానికి అమర్చాల్సిన 10 పవర్ ప్యాక్ లకు గానూ 6 పవర్ ప్యాక్ లను ఏర్పాటు చేశారు. ఇంకా 4 పవర్ ప్యాక్లను పెట్టాల్సి వుంది. 

పక్కా ప్రణాళికతో అప్రోచ్ ఛానెల్ పనులు..
పోలవరం అప్రోచ్ ఛానెల్ లో మట్టి తవ్వకం పనులు పక్కా ప్రణాళికతో చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే అప్రోచ్ ఛానెల్ లో 40 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు జరిగాయి. దాదాపు 300 కు పైగా టిప్పర్లు, 100కు పైగా ఎక్సవేటర్లు రాత్రింబవళ్లు పని చేస్తున్నాయి. అప్పర్ కాఫర్ డ్యాం గ్యాప్ లను మూసివేసి, పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నందున వచ్చే వర్షాకాలం నాటికి స్పిల్ వే నుంచి నీరు ప్రవహించే విధంగా ఏర్పాట్లు చేయాల్సి వుంది. అందులో భాగంగా గోదావరిని సహజ ప్రవాహం నుంచి కుడి వైపునకు 6 కిలోమీటర్ల మేర నీటిని మళ్లించాలి. అందుకు అప్రోచ్ ఛానెల్ (స్పిల్ వే ఎగువన) కీలకమైనది. అప్రోచ్ ఛానెల్ పూర్తి స్థాయిలో తవ్వేందుకు ఆగమేఘాల మీద పనులు సాగుతున్నాయి. కేంద్ర జలసంఘం లక్ష్యాన్ని 4 రెట్లు పెంచడంతో అందుకు తగిన విధంగా మేఘా సంస్థ యుద్ధ ప్రతిపాదికన మట్టి తవ్వకం, రవాణా పనులు చేస్తోంది. 

వేగంగా స్పిల్ ఛానెల్ పనులు..
వరదలను సైతం తట్టుకొని స్పిల్ ఛానెల్ లో ఇప్పటి వరకు 22,7,900 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులతో పాటు స్పిల్ ఛానెల్ లో దాదాపు 28,41785 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు పూర్తి చేసింది మేఘా సంస్థ. ఇక పోలవరంలో అతి కీలకమైన 902 కొండ తవ్వకం పనులు 4,48,487 క్యూబిక్ మీటర్లు పూర్తి చేసింది.

గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దుతూ ఎగువ కాఫర్ ఢ్యాం పనులు..
గత ప్రభుత్వం చేసిన ఇంజనీరింగ్ తప్పులను సరిదిద్దుతూ వైయ‌స్ జగన్ ప్రభుత్వం, ఎగువ కాఫర్ డ్యాం పనులను శరవేగంగా చేస్తోంది. ఎగువ కాఫర్ డ్యాం రీచ్-1లో డయా ఫ్రంవాల్ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తి చేసింది. దాంతో పాటు రాక్ ఫిల్లింగ్ పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే రీచ్-1 నిర్మాణంతో, అందులో దాదాపు 35 మీటర్ల ఎత్తు కు పనులు జరిగాయి. రీచ్-2 నిర్మాణం పూర్తి స్థాయి 42.5 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు పనులు ముమ్మరంగా  సాగుతున్నాయి. ఇక రీచ్-3లో గోదావరి నదీ ప్రవాహానికి అడ్డుకట్ట వేసే పనులు, రీచ్-4 లో రాక్ ఫిల్లింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ మొత్తం ఎగువ కాఫర్ డ్యాంలో ఇప్పటి వరకు 5,77,676 క్యూబిక్ మీటర్ల రాక్ ఫిల్లింగ్ పనులు జరిగాయి.  

గ్యాప్-2 ఎర్త్ కం రాక్ ఫిల్ ఢ్యాం పనులు..
ప్రాజెక్ట్ గ్యాప్-2 లో భాగంగా ఇప్పటికే 11,96,500 క్యూబిక్ మీటర్ల వైబ్రో కాంపాక్షన్ పనులు పూర్తి అయ్యాయి. అదే విధంగా 1,61,310 క్యూబిక్ మీటర్ల శాండ్ ఫిల్లింగ్ పనులు పూర్తి అయ్యాయి. పోలవరం జలాశయంలో స్పిల్ వే తో పాటు ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం (గ్యాప్-2) కూడా కీలకమైనది. గోదావరి నది ప్రవాహ భాగంలో ఇసుక తిన్నెలపైన దీనిని నిర్మిస్తారు. ఇక్కడ రాతినేల ఎక్కడో లోతుగా ఉండడం వల్ల నిర్మాణ పని పటిష్టత కోసం కేంద్ర జలసంఘం ఆధీనంలోని డిడిఆర్పి (డ్యాం డిజైన్ రివ్వ్యూ పానెల్) సూచనల మేరకు పనులను చేపట్టేందుకు అవసరమైన ప్రాథమిక పనులన్నీంటిన్ని కొనసాగుతున్నాయి.

కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలోనే పోలవరం పనులు..
రాష్ట్ర‌ ప్రభుత్వం నిర్మాణ పనులు చేయిస్తున్నా పర్యవేక్షణ మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది. ప్రాజెక్ట్ లో  అంగుళం పనిలో మార్పులు, చేర్పలైనా కేంద్ర జలసంఘం చేయాల్సిందే. అందులో భాగంగానే జలాశయ పరిరక్షణ, సరైన ప్రయోజనాలు సాధించే దిశగా పనుల పరిమాణం గణనీయంగా పెరిగింది. అందుకే ఇటీవల కేంద్ర ప్రభుత్వం సవరించిన మార్పులు, చేర్పులు చేసిన పనుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అంచనాలను సవరించింది. అందులో భాగంగానే దాదాపు 1656 కోట్ల రూపాయల అంచనా వ్యయం పెరిగింది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పనుల్లో పాత పనులను చక్కబెడుతూనే ఓ వైపు లక్ష్యాన్ని అధిగమించే దిశగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అడుగులు వేస్తోంది.