తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నేటి నుంచి `మేమంతా సిద్ధం` బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. తొలుత దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులు అర్పించిన అనంతరం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను సీఎం వైయస్ జగన్ ప్రారంభిస్తారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజులపాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తాను చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే బస్సు యాత్రలోనూ రోజూ ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం వైయస్ జగన్ మమేకమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగుపర్చుకోవడానికి వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. సాయంత్రం ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు.
తొలిరోజు బస్సు యాత్ర షెడ్యూల్
వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ నేడు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు ఇడుపులపాయకు చేరుకుంటారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను సీఎం వైయస్ జగన్ ప్రారంభిస్తారు. ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపునాయనిపల్లి (కమలాపురం), గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, యర్రగుంట్ల (జమ్మలమడుగు), పోట్లదుర్తి మీదుగా సాయంత్రం 4.30 గంటలకి ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డు సమీపంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభ వద్దకు చేరుకుంటారు. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.