జనవరి 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని ఆర్టీసీ ఉద్యోగులు కాళ్లా వేళ్లా పడినా చంద్రబాబు కనికరించలేదు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కాంట్రాక్టు కార్మికులను కూడా విలీనం చేయమని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది చారిత్రాత్మకం. ఉమ్మడి ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉండగా 1997లో ఒక బిల్లు తీసుకొచ్చాడు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ఏ ఉద్యోగీ ప్రభుత్వంలో విలీనం కావడానికి వీల్లేకుండా ఆయనొక బిల్లు తెచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి కొత్త బిల్లును ప్రవేశపెడుతున్నాం. 52వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడతారు. అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగుల మాదిరిగానే ఇకపై ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో ఆర్టీసీ ఉద్యోగులు గుర్తించబడతారు. 58 ఏళ్ల రిటైర్మంట్ వయసువారు 60 ఏళ్లకు పెంచమని కోరినా చంద్రబాబు కనికరించలేదు. ఇకపై వీరికీ పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నాం. జనవరి 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడతారు. ఇందుకు గాను రూ. 3600 కోట్లు ప్రభుత్వంపై అదనపు భారం పడనుంది. ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.