పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీపై సీఎం సమీక్ష

21 May, 2020 16:27 IST

తాడేపల్లి: పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, వైయస్‌ఆర్‌ జిల్లా కలెక్టర్‌ హరికిరణ్, పాడా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పులివెందుల మెడికల్‌ కాలేజీ శంకుస్థాపన, పనుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. ఆగస్టు కల్లా టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టి త్వరితగతిన పూర్తిచేసి ఈ సంవత్సరంలోగా మెడికల్‌ కాలేజీ పనులు ప్రారంభించాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. 

జీఎన్‌ఎస్‌ఎస్‌ మెయిన్‌ కెనాల్‌ – చక్రాయపేట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ పనుల పురోగతిపై సీఎం ఆరా తీశారు. వీలైనంత త్వరగా పనులు గ్రౌండింగ్‌ కావాలని అధికారులను ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన ఈ నెలాఖరుకల్లా జ్యుడిషియల్‌ ప్రివ్యూ పూర్తిచేసి టెండర్ల ప్రక్రియకు సిద్ధం కావాలని ఆదేశించారు. వేంపల్లి మండలంలోని అలవలపాడు, పెండ్లూరు చెరువు, జీఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి పీబీసీ కెనాల్‌కు రూ.46.5 కోట్లతో లిఫ్ట్‌ స్కీమ్‌కు పాలనాపరమైన అనుమతుల మంజూరుకు సీఎం ఆదేశించారు. 

పులివెందులలో అరటి స్టోరేజీ, ప్రాసెసింగ్‌ యూనిట్‌తో పాటు అనంతపురం, కడప వంటి అరటి సాగు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రాసెసింగ్‌ యూనిట్లు సిద్ధం చేయాలన్నారు. అరటి, టమాటా, బత్తాయి పంటల దిగుబడి సమయంలో సమస్యలు రాకూడదని, రైతులు నష్టపోకుండా శాశ్వత పరిష్కారం ఉండాలని ఆదేశించారు. 

రాష్ట్రంలో అన్ని ట్రిపుల్‌ ఐటీలలో పక్కదారి పట్టిన నిధులను తిరిగి వెంటనే వెనక్కి ఇచ్చే ప్రక్రియను మొదలుపెట్టాలని అధికారులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. దేవుని కడప చెరువు సుందరీకరణ, రాజీవ్‌ మార్గ్‌ అభివృద్ధి పనులకు నిధుల విడుదలకు ఆదేశించారు. రిమ్స్‌ ఆస్పత్రి అభివృద్ధిలో భాగంగా డాక్టర్‌ వైయస్‌ఆర్‌ కేన్సర్‌ ఆస్పత్రి, సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్, సైకియాట్రీ ఆస్పత్రులకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. 

అగ్రికల్చర్‌ అడ్వయిజరీ కమిటీలు త్వరగా నియమించి మిల్లెట్‌ల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఏపీ కార్ల్‌కు అనుబంధంగా అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ కాలేజీలతో పాటు వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌ను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా పులివెందులలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్కూల్‌ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని, అరటి రీసెర్చ్‌ సెంటర్‌లో ట్రైనింగ్‌ వెంటనే ప్రారంభించాలని అధికారులను సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.