పనుల నాణ్యతలో ఎక్కడా రాజీపడొద్దు

3 Feb, 2021 16:43 IST

తాడేపల్లి: రెండో విడత మనబడి నాడు– నేడు పనులకు సిద్ధం కావాలని, పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దని సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.  పాఠశాలల్లో నాడు– నేడు పనులపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి  విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ చినవీరభద్రుడు, సమగ్ర శిక్షా అభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రిసెల్వి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. మొదటి విడత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మరింత సమర్థవంతంగా రెండో విడత పనులు ప్రారంభించాలని  ఆదేశించారు.  రెండో విడత పనులను ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. డిసెంబర్‌ 31లోగా పనులు పూర్తిచేసేలా ప్రణాళిక వేసుకున్నట్లు వివరించారు. రెండో విడత కోసం సుమారు రూ.4,446 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మొదటి విడత కోసం సుమారు రూ.3,700 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ఇంతమొత్తంలో ఖర్చు చేయడం ప్రప్రధమం అని అధికారులు తెలిపారు. 

పాఠశాల పునఃప్రారంభం, విద్యార్థుల హాజరుపై అధికారుల నుంచి సీఎం వైయస్‌ జగన్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు గైర్హాజరయితే వారి తల్లిదండ్రులకు ఎస్‌ఎంఎస్‌ పంపించాలని, రెండో రోజు నేరుగా వలంటీర్‌ను పంపి వివరాలు తెలుసుకోవాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. పిల్లల హాజరుపై యాప్‌ను రూపొందించారా..? అని అధికారులను ప్రశ్నించారు. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి విద్యార్థుల హాజరుపై యాప్‌ ద్వారా వివరాలు సేకరిస్తామని అధికారులు తెలిపారు.