తాడేపల్లి: సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో నాడు–నేడుపై సీఎం వైయస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం అంజాద్బాషా, మంత్రి విశ్వరూప్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. హాస్టళ్లలో నాడు–నేడు అమలు చేసి వాటి పరిస్థితిని మార్చాలని అధికారులను ఆదేశించారు. హాస్టళ్లలో చక్కటి వాతావరణం, నాణ్యమైన ఆహారం ఉండాలన్నారు. జగనన్న గోరుముద్ద మాదిరిగా మెనూ ఉండాలని అధికారులకు సూచించారు. హాస్టల్ విద్యార్థులకూ జగనన్న విద్యా కానుక ఇస్తామని చెప్పారు. పిల్లలకు ఏం ఇస్తే బాగుంటుంది..? ఏ విధంగా పౌష్టికాహారం ఇవ్వాలనేదానిపై ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశించారు.