సచివాలయం: కౌలు రైతులకు రుణాల మంజూరుకు బ్యాంకులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కోరారు. సచివాలయంలో సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన ఎస్ఎల్బీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఖరీఫ్ రుణ ప్రణాళికపై బ్యాంకర్లతో సీఎం వైయస్ జగన్ చర్చించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. మహిళలకు వడ్డీ రేట్లపై బ్యాంకర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. వైయస్ఆర్ జిల్లా మాదిరిగానే బ్యాంకుల డిజిటలైజేషన్ ప్రక్రియను అన్ని జిల్లాల్లోనూ అమలు చేయాలన్నారు.
గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని సీఎం వివరించారు. గ్రామాల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం దిశగా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణాలపై ఆధారపడే పరిస్థితులను తగ్గిస్తున్నామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలతో విప్లవాత్మకమైన పరిస్థితులు తెస్తున్నామన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.