తాడేపల్లి: ఉన్నత విద్యా వ్యవస్థలో నాణ్యతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి విద్యాశాఖ అధికారులకు సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నత విద్యపై సీఎం వైయస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర పాల్గొన్నారు. కాలేజీల ఫీజుల ప్రతిపాదనలను సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మనం రూపొందించుకునే విధానాలు.. దీర్ఘకాలం అమలు కావాలన్నారు ప్రమాణాలు పాటించని కాలేజీలపై కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పటికప్పుడు చెల్లింపునకు సిద్ధంగా ఉన్నామన్నారు. గతేడాది బకాయిలతో పాటు ఈ ఏడాది మూడు త్రైమాసికలకు సంబంధించి, ప్రభుత్వం తరఫున చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.