సమగ్ర భూ సర్వేపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

31 Aug, 2020 14:48 IST

తాడేపల్లి: వచ్చే జనవరి 1వ తేదీ నుంచి సమగ్ర భూ సర్వే చేపట్టాలని, 2023 ఆగస్టు వరకు సర్వే పూర్తికావాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. సమగ్ర భూసర్వేపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్‌ నీలం సాహ్ని, సీఎం ప్రిన్సిపల్‌ అడ్వయిజర్‌ అజేయ కల్లం, సీసీఎల్‌ఏ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ల్యాండ్‌ సర్వే పైలెట్‌ ప్రాజెక్టు ప్రజెంటేషన్‌ను అధికారులు సీఎం వైయస్‌ జగన్‌కు వివరించారు. 

అర్బన్‌ ప్రాంతాల్లోనూ సమగ్ర భూ సర్వే చేపట్టాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. సమగ్ర భూసర్వే వివాదాల పరిష్కారానికి మొబైల్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. వివాదాలు అక్కడికక్కడే పరిష్కారంపై దృష్టిపెట్టాలన్నారు. భూసర్వే కోసం డ్రోన్లు, రోవర్లు, సర్వే రాళ్లు ఏర్పాటు చేసుకోవాలని, సర్వేయర్లకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.